తెలంగాణ రాజధాని హైదరాబాద్లో “హైడ్రా” (Hydra) ప్రాజెక్టు పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా జవహర్నగర్ (Jawaharnagar) వంటి పేదవాడల ప్రాంతాల్లో వరుసగా గుడిసెలు, చిన్న ఇల్లు, పొలాలలో నిర్మితమైన నివాసాలను కూల్చివేయడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ఆగ్రహం పేదల పక్షాన, ప్రభుత్వ వేధింపులపై సూటిగా వ్యక్తమవుతోంది.

ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఈటల
జవహర్నగర్ ప్రాంతాన్ని సందర్శించిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ 30, 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవాడు ధనవంతుడా లేక నిరుపేదో ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. “చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటు. ముర్ఖుల్లారా.. మీకు కళ్లు కనబడటం లేదా?” అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదల బతుకుల్లో మట్టి కొట్టడం ద్వారా ప్రభుత్వానికి ఏం లభిస్తుందని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు
తీవ్రంగా విరుచుకుపడిన ఈటల, కాంగ్రెస్ నేతలపై ఈటల సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ అక్రమ కట్టడాలను, కబ్జాలను క్రమబద్ధీకరించేందుకే జీవో నెం.58, 59 తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు బడా నేతల కబ్జాలను కాపాడుతూ, మరోవైపు పూరి గుడిసెలను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర హెచ్చరిక
లంచాలు ఇవ్వని కారణంగానే అధికారులు గద్దల్లా వాలిపోయి పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని, వారి ఉసురు కచ్చితంగా తగులుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలని, నిరుపేదల విషయంలో తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read also: Revanth Reddy: పాశమైలారం రియాక్టర్ పేలుడు పై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం