హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆరోగ్యశాల(Erragadda Hospital)లో జరిగిన ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేసిన భోజనం తిన్న తర్వాత ఒక్కసారిగా విరోచనాలు, వాంతులతో 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ప్రథమ చికిత్స జరిపించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టింది.
కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు
ఆహారం కలుషితంగా ఉండటంపై ప్రాథమికంగా విచారణ జరిపిన అధికారులు, భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డా. పద్మజపై సస్పెన్షన్ విధించారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆసుపత్రిని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
అధికారులపై కఠిన చర్యలు
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ రోగులకు సరైన ఆహారం, శుభ్రత వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందకపోవడం కలవరానికి గురి చేస్తోంది. బాధిత కుటుంబాలు బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Also : Botsa Health Update : నేను కోలుకున్నా.. ఆందోళన వద్దు – బొత్స