ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు శుభవార్తను అందించాయి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ చార్జీల పెరుగుదలతో వినియోగదారులు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా ట్రాన్స్కో సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో విద్యుత్ చార్జీలను తగ్గించే ప్రతిపాదనను చేర్చింది.
రూ.1,059 కోట్లు డిస్కంలకు సర్దుబాటు
ట్రాన్స్కో సంస్థ 2019-24 మధ్య పెట్టుబడిగా వెచ్చించిన ఖర్చు, APERC అనుమతించిన ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో రూ.1,059 కోట్లు డిస్కంలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. దీని ప్రభావంగా వినియోగదారులపై ఉండే విద్యుత్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

APERC నిర్ణయం ఎలా ఉంటుందో?
APERC ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తే, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు లాభం కలగనుంది. విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు సంబంధించిన అంచనాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో కేవలం గృహ వినియోగదారులు మాత్రమే కాకుండా, పారిశ్రామిక, వాణిజ్య విభాగాలకూ విద్యుత్ ఖర్చులో ఊరట లభించనుంది.
వినియోగదారులకు ప్రయోజనమా?
విద్యుత్ ఛార్జీలు తగ్గితే సామాన్య ప్రజలతో పాటు వ్యాపార రంగానికి కూడా ఇది మంచి పరిణామంగా మారనుంది. ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యుత్ ధరల తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గి, మరింత ప్రోత్సాహం లభించనుంది.