నిన్న కోరం లేక ఎన్నిక ఈరోజుకి వాయిదా వేసిన అధికారులు.అమరావతి : తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంట్లోకి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లారు. ఆ ఛైర్పర్సన్ ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.మరోసారి తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా.

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట
సోమవారం కోరం లేక ఎన్నికను అధికారులు ఈరోజుకి వాయిదా వేశారు. టీడీపీకి 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. సోమవారం టీడీపీకి మద్దతిచ్చిన కౌన్సిలర్లు హాజరుకాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఎన్నికకు వెళ్లకుండా కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లను వైసీపీ నేత దాడిశెట్టి రాజా ఛైర్పర్సన్ ఇంట్లో నిర్బంధించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో దాడిశెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు భద్రత కట్టుదిట్టం
కౌన్సిలర్ల నిర్బంధంపై దాడిశెట్టి రాజా, మరో 10 మందిపై కేసులు నమోదయ్యాయి. నేడు చలో తునికి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. అయితే చలో తునికి అనుమతులు లేవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం జరిగిన ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) అమల్లో ఉంది. ఈ మేరకు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
మరోవైపు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా.. నేడు కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు.