ఉప్పల్ : 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ ద్వారక నగర్ కు చెందిన ధర్మారెడ్డి,సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఉదయం క్లాస్ రూమ్ లో పిటి ఆంజనేయులు వచ్చి ఇష్టం ఉన్నట్టు మందలించి కొట్టడంతో మనస్థాపానికి గురై క్లాస్ టీచర్ కి వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే స్కూల్ కరస్పాండెంట్ దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి చనిపోయాడని నిర్ధారణ చేశారు.మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూలుకు చేరుకున్నారు. స్కూల్ యజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు.విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలు విద్యార్థులు ఆందోళనకు దిగారు.సమాచారం తెలవగానే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.