గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్రబాబు ట్వీట్
అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడతామన్నారు. పాడేరులో గిరిజనుల నిరసన నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా సీఎం స్పందించారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అని అన్నారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలనే ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలు, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ 3 తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. దాని పునరుద్ధరణకు మేం కృషి చేస్తాం అన్నారు. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు.