వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఈయూ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అన్నంత పనీ చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.
27 దేశాల యూరోపియన్ యూనియన్పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఈయూపై సుంకాలు విధిస్తాం. మీకు నిజమైన సమాధానం కావాలా? లేక రాజకీయ పరమైన సమాధానం కోరుకుంటున్నారా?’’ అని అయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలోనూ యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇది ఈయూతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై సంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది.

కాగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించే దస్త్రంపై శనివారం సంతకం చేశారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్కు తెరలేచింది. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి తమదేశానికి వచ్చే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము 25 శాతం సుంకాలు విధించినట్టు, వాటిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల ప్రభావం మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్పై సైతం రేపో మాపో ఆంక్షలు విధించే అవకాశముందని వారు తెలిపారు. అమెరికా చర్యపై చైనా డబ్ల్యూటీవోను ఆశ్రయించినా, ప్రతీకార చర్యలకు దిగినా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా పలు అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. పైగా దీని కారణంగా అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అవి హెచ్చరిస్తున్నాయి.