Pawan Kalyan: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు కారణమని అన్నారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని వివరించారు.

గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు
ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నా అని పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు.
ఆయా కులాల జనాభాలో తేడాలు
ఇక, ఏపీలో మాల కులస్తులు ఎక్కువగా ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కులాల జనాభాలో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఇలా ఒక్కో చోట ఒక్కో కులం ఆధిక్యంలో ఉందని, ఈ నేపథ్యంలో వర్గీకరణ చేయడం అనేది ఎంతో సమతుల్యంతో చేయాల్సిన పని అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును జనసేన తరఫున మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.