డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు కొత్త సమస్యగా మారిందా?
2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనలోకి నెడుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాల సంఖ్యను నిర్ణయిస్తే, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రాధాన్యత దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండటంతో, అక్కడి లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉందని, తమ హక్కులను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
స్టాలిన్ పిలుపుతో కొత్త ఉద్యమం
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఐక్యంగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్రం తీసుకున్న డీలిమిటేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ అధినాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, డీలిమిటేషన్ అనేది న్యాయబద్ధంగా జరగాలని డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ విభజన సరికాదా?
దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ, అభివృద్ధి చర్యలు సమర్థంగా అమలు చేస్తూ వచ్చాయి. దీని ఫలితంగా జనాభా వృద్ధి రేటు తగ్గింది. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయిస్తే, ఈ రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. అభివృద్ధికి పాటుపడిన రాష్ట్రాలు నష్టపోతే, ఇది అన్యాయం కాకముందా? అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. “మేము అభివృద్ధి సాధిస్తే, దాని మూల్యంగా శిక్ష అనుభవించాల?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ సముచితమైన విధానంతో జరగాల్సిందే అంటూ దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
న్యాయ పోరాటం మొదలుకానుందా?
స్టాలిన్ సూచనతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వైఖరి పక్షపాతం ఉంటే, దాన్ని ఎదుర్కొనేందుకు కోర్టులో న్యాయ పోరాటం చేయాలని దక్షిణాది నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో సమావేశం జరిపి సభ్యసంఖ్య తగ్గకూడదనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తున్నారు.
తమిళనాడు భవిష్యత్తుపై స్టాలిన్ ఆందోళన
డీలిమిటేషన్ వల్ల తమిళనాడు వంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య తగ్గితే, నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గకుండా చూడాలని, లౌకిక రాజకీయాల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
దక్షిణాది ఐక్యత – కొత్త సమీకరణాలకా?
స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల్లో ఐక్యతను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ మిత్రపక్షాలేతర నేతలు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ కాకూడదు
దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గించరాదు
న్యాయసమరానికి సిద్ధంగా ఉండాలి
ఐక్యంగా పోరాడాలి