న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్), ఉత్తర్ప్రదేశ్లోని మిల్కిపుర్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 26.03 శాతం, 29.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్లో ఉప ఎన్నికను సమాజ్వాదీ పార్టీ, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.