రేఖా గుప్తాకు ప్రధాని మోడీ పలు సలహాలు, సూచనలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోడీ ఆమెకు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్, విద్యార్థులను కలిసి మాట్లాడారు.

మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
ఈ సందర్భంగా రేఖాగుప్తా మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన రేఖా గుప్తా మాత్రమే కాదు మీరంతా కూడా సీఎంలు కావాలని విద్యార్థులతో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రేఖా గుప్తాకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. కాగా ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కారు.. సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోంది.
25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదిక
ఫిబ్రవరి 24న నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరిచేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాగ్ నివేదికపై ఫిబ్రవరి 25, 27 తేదీల్లో చర్చ జరగనుంది.