YS Vivekananda : వైఎస్ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్ పేల్చారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య జరిగి ఆరేళ్లైనా నిందితులందరూ బయటే తిరుగుతున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహించారు. ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు.

మళ్లీ సీబీఐ విచారణ మొదలు
నాన్న హత్యకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. నిందితుల కంటే మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, సీబీఐ మళ్లీ విచారణ మొదలుపెడుతుందని ఆశిస్తున్నా అంటూ వైఎస్ సునీతా రెడ్డి తెలిపారు. దీనిపై ఏపీ సర్కార్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.
టీడీపీపై ఆరోపణలు
కాగా, 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. టీడీపీపై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసును జగన్ అంతగా పట్టించుకోలేదు. వివేకా హత్య కేసుపై నాటి జగన్ సర్కారు ఫోకస్ చేయకపోవడంతో వివేకా కుమార్తె సునీతకు అనుమానం వచ్చింది. వైఎస్ సునీతారెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దీనికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది. సీబీఐ విచారణ మొదలయ్యాకే.. వివేకాది గుండెపోటు కాదని హత్య అని తేలింది.