విజయవాడలో వెలుగుచూసిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువే కిరాతకురాలిగా మారి, మూడేళ్ల పసికందుపై యాసిడ్ పోయడం అత్యంత దారుణం. ఫిబ్రవరి 23న పాఠశాలకు వెళ్లిన చిన్నారి ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పడటంతో ఆ బిడ్డ పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. ఘటన జరిగిన సమయంలో పాప బాత్రూమ్లో పడిపోయిందని కట్టుకథలు అల్లిన సదరు టీచర్ ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు సైతం ఇది ప్రమాదం కాదని, యాసిడ్ దాడి అని నిర్ధారించడం ఈ దారుణానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
Read Also : Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!
ఈ ఉదంతంలో పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు మరీ దారుణంగా ఉంది. తప్పును సరిదిద్ది బాధితులకు అండగా నిలవాల్సింది పోయి, రాజీ పడాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అంతటితో ఆగక, తమకు పోలీసు పలుకుబడి ఉందని, ఈ విషయాన్ని బయటకు పొక్కనిస్తే అంతుచూస్తామని స్కూలు ప్రిన్సిపల్ స్వయంగా బెదిరింపులకు దిగడం గమనార్హం. కనీసం మూత్ర విసర్జన కూడా చేయలేని స్థితిలో ఆ పసిపాప విలవిలలాడుతుంటే, స్కూల్ యాజమాన్యం తమ పరువును కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం వారి మానవత్వ విలువల పతనాన్ని సూచిస్తోంది.
Read Also : Gold Rate Today: మరోసారి తగ్గిన పసిడి ధరలు
విద్యాధరపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించడం ఆందోళన కలిగిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల లాంటి సురక్షితమైన ప్రదేశంలోనే ఇలాంటి ఘోరాలు జరిగితే, ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ నమ్మాలనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడటంతో పాటు, ఆ పసిబిడ్డకు సరైన వైద్యం అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com