ఈ మధ్య కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకే పెద్ద కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్స్ చూడడం, ఆన్లైన్ గేమ్స్ ఆడటం, తల్లితండ్రులపై ఊరకనే కోప్పడటం వంటివి చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్కి బానిసై, తల్లిదండ్రుల మందలింపులు, చదువు ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం, తల్లితండ్రులకు మరువలేని శోకం మిగుల్చుతున్నారు. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. తల్లితండ్రులు పబ్జి గేమ్ ఆడద్దన్నందుకు 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా భైంసాలో పబ్జీ మొబైల్ గేమ్ (PUBG Mobile Game)కి బానిసైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. చిన్న వయసులోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం తల్లిదండ్రులను కన్నీటి మున్నీరులో ముంచేసింది.
పబ్జీ వ్యసనం ఆఖరికి ప్రాణం తీసింది
భైంసాలో నివసిస్తున్న భేతి సంతోష్ కుటుంబం చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆయన కుమారుడు రిషేంద్ర (13), 9వ తరగతి విద్యార్థి. చదువుతో పాటు రిషేంద్ర మొబైల్లో పబ్జీ గేమ్ ఆడడంలో మునిగిపోయేవాడు. రోజంతా గేమ్ ఆడటమే అలవాటుగా మారింది. పబ్జీ ఆడొద్దని తల్లిదండ్రులు ఎన్నిసార్లు మందలించినా, రిషేంద్ర వినేవాడు కాదు. మళ్లీ అదే అలవాటు కొనసాగించాడు. చివరికి, తాజాగా తండ్రి సంతోష్, తల్లి మరోసారి మందలించడంతో మనస్థాపం చెందిన రిషేంద్ర ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide by hanging) చేసుకున్నాడు.
కుటుంబంలో విషాదం
కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రిషేంద్ర మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్క చిన్న కారణం వల్ల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న భైంసా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న పరిస్థితులను దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: