Latest news: NH 163: అవి జాతీయ రహదారులు కావు..మృత్యు కోపాలు

Read Time:  1 min
NH 163
NH 163
FONT SIZE
GET APP

చేవెళ్ల మండలం వద్ద ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం

చేవెళ్ల మండలం(Chevella mandal) మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకున్న తీవ్రమైన రోడ్డు ప్రమాదం(NH 163) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగినప్పటికీ, రహదారి విస్తరణ చేపట్టకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అప్పా జంక్షన్‌ నుంచి తాండూరు వరకు సుమారు 69 కిలోమీటర్ల దూరంలో దాదాపు 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌, చిన్నషాపూర్‌, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్‌, కందవాడ‌, మల్కాపూర్‌, దామరగిద్ద‌, మీర్జాగూడ‌, ఆలూరు, అంతారం ప్రాంతాల్లోని మలుపులు అత్యంత ప్రమాదకరంగా గుర్తించబడ్డాయి.

అప్పా–మన్నెగూడ మధ్య భాగంలో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారానికి ఐదు వరకు రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారి నిజాం కాలం నాటి చారిత్రాత్మక మార్గం. ఆ సమయంలో నవాబులు బీజాపూర్‌ చేరేందుకు ఈ రహదారినే ఉపయోగించేవారు. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని కలబురగి, బీజాపూర్‌లతోపాటు వికారాబాద్‌ జిల్లాకు వెళ్లేందుకు కీలక రహదారి. అలాగే పర్యాటక ప్రదేశమైన అనంతగిరి కొండలకు వెళ్లే ప్రధాన మార్గం కూడా ఇదే. ఈ మార్గాన్ని పరిసర గ్రామాల ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ అవసరాల కోసం విస్తృతంగా వినియోగిస్తున్నారు.

Read also: నల్లగొండ , కరీంనగర్ , సత్య సాయి లో బస్సులు ఢీ

NH 163
NH 163: అవి జాతీయ రహదారులు కావు..మృత్యు కోపాలు

జాతీయ రహదారి విస్తరణకు గడ్కరీ శంకుస్థాపన ఆలస్యానికి కారణాలు

ఇన్నాళ్లుగా రహదారిపై(NH 163) బీటీ పూత వేయడం మాత్రమే జరుగుతుండగా, ట్రాఫిక్‌ పెరుగుదలకు అనుగుణంగా విస్తరణ చేపట్టలేదు. 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని జాతీయ రహదారి 163గా ప్రకటించింది. రూ.785 కోట్లతో అప్పా జంక్షన్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ వరకు 46.40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరించేందుకు 2022లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఇందుకోసం 145.42 హెక్టార్ల భూమిని సేకరించింది. అయితే విస్తరణ పనులకు ప్రారంభం నుంచే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ మార్గంలో పలువురు ప్రముఖుల స్థలాలు, ఫాంహౌస్‌లు ఉండటంతో భూముల స్వాధీనం ఆలస్యం అయింది. మరోవైపు, ఈ రహదారి పక్కన 900కు పైగా మర్రి చెట్లు ఉండటంతో వాటిని నరికివేయడంపై పర్యావరణ సంస్థ సేవ్ బనియన్స్ ఎన్జీటీలో పిటిషన్‌ వేసింది.

కోర్టు స్టే విధించడంతో పనులు నిలిచిపోయాయి. అయితే చెట్లను రీలోకేట్‌ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎన్జీటీ ఇటీవల స్టే ఎత్తివేసింది. దీంతో విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. 2021 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహదారిపై 720 ప్రమాదాలు చోటుచేసుకుని, 211 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 737 మంది గాయపడ్డారు. రహదారి మధ్యలో డివైడర్లు లేకపోవడం, వెడల్పు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. స్థానికులు రహదారి విస్తరణను వేగవంతం చేయాలని, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.