Telugu News: Delhi Blast: ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి

Read Time:  1 min
Delhi Blast
Delhi Blast
FONT SIZE
GET APP

దిల్లీ ఎర్రకోట( Delhi Blast) సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. పోలీసులు, ఫోరెన్సిక్ టీములు ఆదివారం మరోసారి ఘటన స్థలాన్ని పరిశీలించి పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. ముఖ్యంగా అక్కడ మూడు 9 మిల్లీమీటర్ కార్ట్రిడ్జ్‌లు లభించడం దర్యాప్తులో కొత్త మలుపు తీసుకొచ్చింది. భద్రతా సిబ్బంది సాధారణంగా వినియోగించే రకమైనవి కావడంతో, అవి ఆ ప్రాంతంలో ఎలా కనిపించాయనే అంశం ఇప్పుడు పరిశోధనకు కేంద్రబిందువైంది. అయితే, అక్కడ ఎలాంటి పిస్టల్‌ గుర్తింపబడలేదు.

Read Also: Srinagar Blast: ఈ పూటకు వెళ్లొద్దని కూతురు అడ్డుకున్నా… పేలుడులో ప్రాణాలు కోల్పోయిన షఫీ

దిల్లీ పోలీసుల( Delhi Blast) ప్రకారం, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి ఉన్న ఆయుధాల్లోని బుల్లెట్లను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. సంఘటనా స్థలంలో లభించిన కార్ట్రిడ్జ్‌లకు వాటికి సంబంధం లేదని స్పష్టమైంది. దీంతో ఈ బుల్లెట్లు ఇతరుల ద్వారా అక్కడికి చేరిన అవకాశంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన – 2 కిలోల అమోనియం నైట్రేట్ వినియోగం

పేలుడు చోటుచేసుకున్న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ పోలీసులు సురక్షితంగా సేకరించి అధ్యయనం చేస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) ప్రాథమిక నివేదిక ప్రకారం, పేలుడులో సుమారు రెండు కిలోల అమోనియం నైట్రేట్ ఉపయోగించారని తేలింది. ఇప్పటి వరకు సేకరించిన సుమారు 40 నమూనాల్లో రెండు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు ధృవీకరించారు. ఇవి దర్యాప్తు దిశను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఉమర్ నబీ ఫండింగ్‌ – హవాలా నెట్‌వర్క్‌పై అనుమానాలు

ఈ కేసులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తిగా గుర్తించిన డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 20 లక్షలకు పైగా నిధులు సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నూహ్ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ఎరువులు కొనుగోలు చేసి వాటితో పేలుడు పదార్థాలను తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ నిధుల సరఫరాలో హవాలా డీలర్లు కీలక పాత్ర పోషించినట్లు భావించిన పోలీసులు పలు ప్రాంతాల్లో విచారణను కొనసాగిస్తున్నారు. ఉమర్ నబీ ప్రయాణించిన కారులో మరెవరైనా ఉన్నారా? కారును మధ్యలో ఎక్కడైనా వదిలారా? పేలుడు పదార్థాలను ఎవరు ఎలా వాహనంలో ఉంచారు? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం దర్యాప్తు సాగుతోంది.

అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థం TATP అనుమానం

దర్యాప్తు వ్యవస్థలు మరింతగా దృష్టి సారిస్తున్న అంశం TATP (triacetone triperoxide) పై. ఇది “మదర్ ఆఫ్ సాతాన్” పేలుడు పదార్థంగా పేరుగాంచింది. డిటోనేటర్ లేకుండానే కేవలం వేడి వల్లే పేలిపోవడం దీని ప్రత్యేక లక్షణం. ఘటనలో ఇది ఉపయోగించబడించి ఉంటుందనే అనుమానాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఖండించడం లేదు. ఈ దాడి వెనుక పెద్ద టెర్రర్ నెట్‌వర్క్ ఉన్నట్లు భావిస్తున్న NIA, పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ లలో విస్తృత దాడులు చేపట్టింది. నిధులు అందించిన వ్యక్తులు, సహకరించిన వర్గాలు, మాడ్యూల్ సభ్యులను గుర్తించడానికి ఈ చర్యలు చేపడుతున్నారు.

పేలుడు ప్రాంతం నుంచి కొత్తగా మూడు కార్ట్రిడ్జ్‌లు

తాజాగా ఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 9mm కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు బుల్లెట్లతో ఉండగా ఒకటి ఖాళీగా ఉంది. కానీ అక్కడ ఎలాంటి తుపాకి కనుగొనకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇవి భద్రతా దళాల నుండి వచ్చాయా? లేక దాడికి పాల్పడిన వర్గం వాడిన గన్‌ నుంచా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పేలుడు తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూసివేసిన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్లను DMRC శనివారం తిరిగి తెరిచింది. మెట్రో సర్వీసులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.