తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల్లోకి వాటి ప్రాధాన్యత చాటించడంపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ‘సన్నబియ్యం’, ‘ఇందిరమ్మ ఇళ్లు’, ‘భూభారతి’ వంటి పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి, ప్రజల మద్దతు పొందేలా చేసే వ్యూహాలపై నేతలకు మార్గదర్శనం చేయనున్నారు.
ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలు
ఇకపోతే, ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలు కూడా ముఖ్యాంశాలుగా చర్చకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు శాసన సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించే అవకాశముంది. రానున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీలో ఏకతాటిపై కార్యాచరణ కొనసాగించాలన్నదే పార్టీ నాయకత్వ ఉద్దేశం.

కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత వివాదాలు
ఇక, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత వివాదాలు, సంబంధిత నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ బలోపేతం దిశగా సీఎం రేవంత్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సమష్టిగా ముందుకు సాగేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది. అన్ని అంశాలపై నేతల అభిప్రాయాలను సేకరించి, ఆ తరువాత కేటాయించబోయే బాధ్యతలపై స్పష్టత ఇవ్వనున్నారు.