తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కల్యాణ్ నాయక్ నేతృత్వంలో ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ డీకే అరుణ వీరికి పార్టీ కండువా కప్పి కమలదళంలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన వారిలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, బీజేపీలో కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వీరు బీజేపీలో చేరారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీకే అరుణ విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ ప్రజలకు చెప్పిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల జనాభా గణనలో తప్పులు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చడం లేదని, రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలు మరోసారి మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఏ ఎన్నికలైనా బీజేపీ విజయాన్ని సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.