ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు (వీహెచ్) మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పేరు దామోదరం సంజీవయ్యగా మారుస్తూ నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ పవన్ కల్యాణ్ను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఎంతో సేవలందించారని ఆయన గుర్తు చేశారు.

దామోదరం సంజీవయ్య సేవలకు గౌరవం
సామాజిక న్యాయం కోసం శ్రమించిన దామోదరం సంజీవయ్య రాష్ట్రంలో కార్మికులకు, పింఛనుదారులకు ప్రయోజనాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని వీహెచ్ పేర్కొన్నారు. ఆయన పేరుతో ఒక స్మారక భవనాన్ని నిర్మించి, ఆయన సేవలను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిశీలించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
వీహెచ్కు పవన్ సత్కారం
ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, వీహెచ్కు శాలువా కప్పి సత్కరించారు. వినాయక విగ్రహాన్ని బహూకరించారు. వీహెచ్ అందించిన విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించి పూర్తిగా చదివి, సంబంధిత అంశాలపై కార్యాచరణను పరిశీలిస్తానని తెలిపారు. రాజకీయ పరంగా విభేదాలు ఉన్నా, సమాజ సేవలో ఏకీభవించేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు ఈ భేటీలో వెల్లడించారు.