హైదరాబాద్: ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీపీఐకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మా అభిప్రాయాన్ని వివరించామని అన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇటీవల అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. ట్రంప్ విధానాలను ప్రధాని మోడీ వ్యతిరేకించాలని అన్నారు. మరోవైపు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సీపీఐ బృందం కలిసింది.

ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి
స్వయంగా ఆయన నివాసంలో కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. పొత్తు ధర్మంలో భాగంగా తమకు రెండు ఎమ్మెల్సీ పదవులను కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉందని, అందులో ఒకటి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వాలని కోరారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రెండింటిలో ఒకటి సీపీఐకి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి, ఆ తర్వాత మరొక ఎమ్మెల్సీ తమకు ఇవ్వాలని అడిగారు. సీఎంతో భేటీ అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతాను అన్నారని కూనంనేని స్పష్టం చేశారు.