10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్నూ అక్కడి ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఆస్తులను కోర్టు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విలువైన వస్తువులను స్వీకరించడానికి తమిళనాడు హోంశాఖ సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రెజరీ అధికారులు ఆస్తులను జాగ్రత్తగా అప్పగించారు. ఆ ఆస్తులకు సంబంధించిన రికార్డులను నమోదు చేసే మొత్తం ప్రక్రియను తమిళనాడు అధికారులు వీడియో రికార్ఢింగ్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియ ఒక మూసి ఉన్న గదిలో జరిగింది. చట్టపరమైన విధానాలను అనుసరించి విలువైన వస్తువులను అధికారికంగా తమిళనాడు అధికారులకు అప్పగించారు.