తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్కు చెందిన ప్రఖ్యాత సంస్థ మరుబెనీ, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఆధునిక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. టోక్యోలో జరిగిన సమావేశంలో సీఎంతో మరుబెనీ ప్రతినిధులు కలిసి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పై సంతకాలు చేశారు.
సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు
ఈ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై దృష్టి సారించనుంది. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇది ఫ్యూచర్ సిటీలో మొదటి మెగా ప్రాజెక్ట్ కావడం గమనార్హం.

ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు
మరుబెనీ సంస్థ ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. వ్యవసాయం, ఫైనాన్స్, విద్యుత్, ఇంధనం, కెమికల్స్, ఏరోస్పేస్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. తెలంగాణను పెట్టుబడులకు ఆదర్శ గమ్యస్థానంగా మలచేందుకు జపాన్ పర్యటన మరో కీలక అడుగుగా నిలిచింది. ఫ్యూచర్ సిటీని దేశంలోనే తొలి నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.