హైదరాబాద్: ఈ నెల 16న అంటే రేపు దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీఆర్ టీమ్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని…సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా… ప్రస్తుతం ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కొత్త భవనంతో పాటు, త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో కోసం నిన్ననే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.

ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. అనంతరం గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళతారు. సింగపూర్కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీకి సంబంధించి సింగపూర్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్శిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి వెళతారు. 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు.