CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్లో జరిగే ఒసాకా–కన్సాయ్ ఎక్స్పో– 2025కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరుకానున్నారు. ఈ మేరకు వారు ఈరోజు(15వ తేదీ) అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి వారు జపాన్ వెళ్తారు. వారి వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యాలయ అధికారి అజిత్రెడ్డి కూడా వెళ్తారని సమాచారం. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తెదీ వరకు జరిగే ఈ ఎక్స్పోలో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భారత్ నుంచి కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నట్లు సమాచారం.

రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఒసాకా షోను వేదిక చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దావోస్ వెళ్లిన రెండు దఫాల్లోనూ దాదాపు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒసాకా ఉత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారని సమాచారం.
ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది?
తెలంగాణలో ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది? ఇక్కడ ఉన్న పెట్టుబడి వాతావరణం, స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్తోపాటు, విద్యుత్, నీటి సరఫరా, భూముల కేటాయింపు, అనుమతులు, రాయితీలు తదితర అంశాలపై రాష్ట్ర బృందం ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. గతంలో రాష్ట్రం నుంచి ఇలాంటి షోకేస్ చేసే ప్రయత్నం జరగలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Read Also: నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం