హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లతో జిల్లాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, ఈ నెల 4న తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోద ముద్ర వేశారు. రైతు భరోసా వ్యవసాయయోగ్యమైన భూములకు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే 26 తేదీ నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబాలను గుర్తించడం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అ నాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో జగలేని నిరుపేదలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.