తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే దిశగా ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ని ఇటీవల ప్రకటించింది. ఈ పాలసీ అమలులో భాగంగా తెలంగాణలో ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసి, దానికి సంబంధించి ముఖ్యమైన బోర్డు సభ్యులను నియమించనుంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్, వ్యాపారవేత్త కావ్య మారన్ను బోర్డు సభ్యురాలిగా ఎంపిక చేసింది.కావ్య మారన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యజమానిగా క్రీడా రంగంలో విశేష అనుభవాన్ని సంపాదించారు. ఆమెకు ఉన్న క్రీడాపై ఆసక్తి, క్రీడాకారులను ప్రోత్సహించాలనే దృక్పథం కారణంగానే ప్రభుత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, వారికి అవసరమైన సదుపాయాలను కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో నిలబడేలా ప్రోత్సహించడం.
బోర్డు సభ్యులుగా
అదనంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా మౌలిక సదుపాయాలను అందించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కూడా ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్గా సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) ను నియమించిన ప్రభుత్వం, కో చైర్మన్ బాధ్యతలను మెగా కోడలు ఉపాసన కామినేనినికి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బోర్డు సభ్యులుగా కావ్య మారన్తో పాటు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడాపాలసీని రూపొందించామని తెలిపారు.

లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు
క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నకార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) వెల్లడించారు. ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది క్రీడాకారులు వచ్చేలా కృషి చేస్తుందని చెప్పారు.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ), సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న గొడవల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీకి అండగా నిలిచారు. హెచ్సీఏ బెదిరింపులకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. సమగ్ర విచారణకు ఆదేశించారు.
అధికారులను సీఐడీ అరెస్ట్ చేసింది
విజిలెన్స్ అధికారుల విచారణలో అక్రమాలు బయటపడటంతో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు ఆరుగురు అధికారులను సీఐడీ అరెస్ట్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో చోటు చేసుకున్న ఈ వాగ్వాదం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్ను విడిచి వెళ్తామని కూడా సన్రైజర్స్ హెచ్చరించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సన్రైజర్స్కు అండగా నిలిచారు. ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. కనీసం ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
కావ్య మారన్ తండ్రి ఎవరు?
కావ్య మారన్ తండ్రి కలానిధి మారన్, సన్ గ్రూప్ (Sun Group) చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త.
కావ్య మారన్కి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యతను ఇచ్చింది?
తెలంగాణ ప్రభుత్వం ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ బోర్డు సభ్యురాలిగా కావ్య మారన్ను నియమించింది, ఇది ‘స్పోర్ట్స్ పాలసీ 2025’లో భాగం.
Read hindi news: hindi.vaartha.com
Read also: