సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కులగణన సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు. కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలు ఉంటే.. మా సర్వేలో 56 శాతం ఉన్నారు.

మరీ బీసీ కాకుండా ఏ కేటగిరి కింద ఉంటారు
ముస్లింలను బీసీలలో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులను ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరీ బీసీ కాకుండా ఏ కేటగిరి కింద ఉంటారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వని ఉద్యోగాలను మేము సంవత్సర కాలంలోనే ఇచ్చినట్టు తెలిపారు.
ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం పై కుట్రలు
రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్స్ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.