అమరావతిలో జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై మంత్రుల తో చర్చించిన సీఎం, ముఖ్యంగా వైసీపీ చేస్తున్న విమర్శలకు సమర్థంగా కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో గోవుల మరణాలపై చేసిన వాదనలను, అలాగే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంపై మంత్రుల నిస్క్రియతను సీఎం తప్పుపట్టారు.
మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి
ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా ప్రజల వరకు చేరడం లేదన్న విషయంలో కూడా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిని వెలిబుచ్చారు. జిల్లాలను యూనిట్గా తీసుకొని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మంత్రి OSDని తప్పించిన ఘటనను ఉదాహరణగా చూపుతూ, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

ప్రతి మంత్రి తగిన ప్రమాణాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం
పలు కేబినెట్ భేటీల్లోనే మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో నమ్మకం పెరగాలంటే, ప్రతి మంత్రి తగిన ప్రమాణాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగని పక్షపాతంగా కాకుండా ప్రతి అంశాన్ని ప్రజల ముందుంచే విధంగా పని చేయాలని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మంత్రులు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.