CM Chandrababu : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మాధ్యమంలో సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు.

దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి
ఇక, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానవని అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారని ఉద్ఘాటించారు.
అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడాలి
మరోవైపు భారతదేశానికి బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని మోడీ కొనియాడారు.
Read Also: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రేపు వైన్స్ లు బంద్