CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణ
ప్రవీణ్ మృతిని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని చెప్పారు. అయితే వివిధ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తుందని లోకేష్ తెలిపారు. ఇక, పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతిపై ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణకు జరపాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశించారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు
కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై కొంత మూరు నయారా పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతిచెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. బైక్ అదుపుతప్పి రోడ్డు నుంచి దిగువకు పడిపోవడంతో మోటార్ సైకిల్ ప్రవీణ్కుమార్పై పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.