- రాష్ట్ర ప్రజలకు గర్వకారణం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో చంద్రబాబు మంచి ర్యాంక్ సాధించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా మారింది.
ఆర్థిక, అభివృద్ధి, పరిపాలనా పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రాశంసనీయంగా నిలుస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.

వివిధ దేశాలకు వెళ్లి ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు తీసుకురావడం ఆయన నాయకత్వ నైపుణ్యాన్ని చాటుతోంది.పెట్టుబడిదారులు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి.
ఐటీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేపట్టిన ప్రణాళికలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయి.అలాగే, చంద్రబాబు పరిపాలనా విధానాలు ప్రజలకు చేరువయ్యేలా ఉండటమే కాకుండా, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం, వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చే చర్యలు తీసుకోవడం, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిధులు వెచ్చించడం తదితర అంశాలు అభివృద్ధికి బలమైన ఆధారంగా మారాయి.
ఇలాంటి ప్రగతిశీల విధానాల కారణంగానే చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అనేక పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.