మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంఅమరావతి: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు పులిమినట్టు అయ్యింది. ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ.

రాజకీయంగా విమర్శలు రైతుల నుంచి విజ్ఞప్తులు
ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడం దీనిపై రాజకీయంగా విమర్శలు రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే నేడు వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనుంది సర్కార్.
రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం
మరోవైపు మిర్చి రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.