రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా ‘ది రాజా సాబ్’ విడుదలకు దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి, ఒక రోజు ముందుగానే అంటే జనవరి 8న పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. అయితే తెలంగాణలో ఈ ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించిన అనుమతులు, టికెట్ ధరల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Read also: Kalyani Priyadarshan: రణ్వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

సింగిల్ స్క్రీన్ టికెట్ ధర
ప్రీమియర్ షోల సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాసినట్లు సమాచారం. మల్టీప్లెక్స్ టికెట్ ధరను రూ.1000గా, సింగిల్ స్క్రీన్ టికెట్ ధరను రూ.800 గా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వాలని వారు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేసినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ పరిశ్రమలో నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బెనిఫిట్ షోల(Benefit shows) అనుమతులు సజావుగా లభిస్తుండగా, తెలంగాణలో మాత్రం న్యాయ సంబంధిత కారణాలతో ఇంకా తుది స్పష్టత రాలేదు. దీంతో నిజాం ప్రాంతంలోని అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
భారత్లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా మొదలుకాకముందే, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ప్రభాస్ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం నార్త్ అమెరికా మార్కెట్లోనే ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సుమారు 3.5 లక్షల డాలర్లు (సుమారు రూ.2.9 కోట్లు) వసూలైనట్లు సమాచారం. ఇప్పటికే వెయ్యికి పైగా స్క్రీన్లలో పది వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. హారర్ కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్లో కనిపించనున్నారు. సుమారు 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో ఎక్కువ భాగం ప్రభాసే స్క్రీన్పై కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించగా, సంగీతాన్ని తమన్ అందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: