అస్వస్థతకు గురైన చిరంజీవి తల్లి
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఇటీవలే చిరంజీవి కుటుంబం ఆమె జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.