మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వార్త తెలిసిన వెంటనే అంజనాదేవిని పరామర్శించేందుకు మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఈ రోజు కార్యక్రమాలను, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంజనాదేవి అనారోగ్యం నేపథ్యంలో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.ఇటీవల అంజనాదేవి పుట్టిన రోజు వేడుకను చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఐదుగురు సంతానం
కొణిదెల అంజనా దేవికి ఐదుగురు సంతానం. చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ ,విజయలక్ష్మి,మాధవి.మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి 1935లో జన్మించారు. ఆమె పూర్తి పేరు అంజనాదేవి కొణిదెల. చిరంజీవి తండ్రి వెంకటరావు, తల్లి అంజనాదేవి దంపతులకు చిరంజీవి సహా నాగబాబు, పవన్ కల్యాణ్, విజయ, మాధవి అనే పిల్లలు ఉన్నారు.అంజనాదేవి తన పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమె, పిల్లలకు మంచి విలువలు, ఆచారాలను నేర్పారు. చిరంజీవి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆమె గొప్ప మద్దతుగా నిలిచారు.అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు ప్రార్థిస్తున్నారు.
హ్యాపీ బర్త్డే
అమ్మా.ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. నీ గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు.నిన్ను ఎంత ప్రేమిస్తున్నామో చెప్పలేం.. నువ్వంటే మాకు ఎంత గౌరవమో నువ్వు కూడా ఊహించలేవు. హ్యాపీ బర్త్డే అమ్మ.. మన కుటుంబానికి నువ్వొక స్వీట్ హార్ట్. మా బలం నువ్వు.. స్వచ్ఛమైన ప్రేమ నువ్వు.. ఇట్లు నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి.” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.
రెగ్యులర్ చెకప్
అయితే అంజనా దేవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లినట్టు పీఆర్ టీమ్ తెలిపింది. అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఆమె కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పటల్ కు వెళ్లారు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్.