అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలపై చైనా స్పందించింది. అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరివరకు పోరాడటానికి తాము సిద్ధమేనని చైనా పేర్కొంది. “అగ్రరాజ్యం మాతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే.. అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా మరే రకమైన యుద్ధమైనా చివరివరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. తమపై విధిస్తున్న టారిఫ్లకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై తాము 10-15 శాతం సుంకాలు విధిస్తామని తెలిపింది. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమరవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే టారిఫ్ ను రెట్టింపు చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొంటున్నప్పటికీ ఫెంటనిల్ సంక్షోభం దాని సొంత పనే అని డ్రాగన్ ఆరోపించింది. “ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా యూఎస్ తిరిగి మమ్మల్నే నిందిస్తోంది. సుంకాల పేరుతో ఒత్తిడి చేసి.. బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకాలం వారికి సహాయం చేసినందుకు వారు మమ్మల్ని శిక్షిస్తున్నారు” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

బెదిరింపు వ్యూహాలు తమపై ప్రభావం చూపవని
ప్రపంచ దేశాలపై అమెరికా అనుసరిస్తున్న సుంకాలు, బెదిరింపు వ్యూహాలు తమపై ప్రభావం చూపవని తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ప్రపంచదేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. తమతో వ్యాపారం చేస్తున్న దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగానే కెనడా, మెక్సికో, భారత్, చైనాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్ సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అగ్రరాజ్యం నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ధ్రువీకృత సహజ వాయువుపై (ఎల్ఎన్జీ) 15 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10 శాతం సుంకాన్ని వసూలుచేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, చైనా సహా పలు దేశాల పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలుచేస్తామని వెల్లడించారు.