న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని అన్నారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరముంది. మిర్చి రైతులను ఆదుకోవాలి, వారికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చామన్నారు.
ఈ ఏడాది అనూహ్యంగా పడిపోయిన మిర్చి ధరలు

సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా.. ధర నిర్ణయించే పరిస్థితికొచ్చారు. సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరాం. శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత.. దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్జీవన్ మిషన్ నిధులు
కేంద్రం మంత్రి సీఆర్ పాటిల్తో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించాం. 2027లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించాం. వైసీపీ ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదు. ఇంటింటికీ నల్లా ద్వారా నీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మేం కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్జీవన్ మిషన్ నిధులు వినియోగించుకుంటాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటామన్నారు.
మిర్చి రైతులకు కేంద్రం సహాయం అందించాలి
రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితిని కేంద్రానికి పూర్తిగా వివరించామని, మిర్చి ఎగుమతులను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రైతులకు తగిన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు మెరుగుపరిచే విధంగా నిబంధనలు సవరించాలని సూచించారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని గంభీరంగా తీసుకొని త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సీఎం వెల్లడించారు.