సమీక్షలో ఆర్థిక శాఖ స్థితిగతుల పరిశీలన
హైదరాబాద్, మార్చి 22 :- రాష్ట్ర ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఆర్థికశాఖ స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.
కేంద్ర నిధుల సమీక్ష
కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రివ్యూ చేశారు. ముఖ్యంగా, కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు త్వరగా విడుదల అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సకాలంలో నిధుల విడుదలకు చర్యలు
కేంద్ర పథకాల సమగ్ర వివరాలను సమర్పించి, ఆర్థికశాఖ ద్వారా నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. మొత్తం 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు నిధులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు
హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

