ఇప్పటికే ఏపీలో కియా కార్ల కంపెనీ ఉండటంతో ఆటో రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈవీ రంగాన్ని ప్రోత్సహించటంతో అనేక కంపెనీలు ఈ కేటగిరీలో పనిచేయటానికి ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాను రాష్ట్రానికి రప్పించటానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్న సంగతి కూడా తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంపిక తర్వాత టెస్లా ఎంట్రీ ఇండియాలోకి జరగనున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే దిల్లీ, ముంబై నగరాల్లో విక్రయాలకు అవసరమైన ఉద్యోగులు, షోరూమ్స్ ఏర్పాటుకు చకచకా సన్నాహాలు కూడా జరగటంతో మరోసారి ఏపీ టెస్లాను ఆకర్షించే రేసులో చేరింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటుతో ఉన్న ప్రయోజనాలను టెస్లా టీమ్ కు కన్వేచేయటం ద్వారా కొత్త పెట్టుబడిని ఆకర్షించాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.

కార్ల కంపెనీకి ప్రతిపాదన
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు తన పోర్ట్ కనెక్టివిటీతో పాటు సమృద్ధిగా ఉన్న భూమితో భవిష్యత్ కార్ల కంపెనీని ఆకర్షించడానికి ఒక ప్రతిపాదన చేసింది. గత ఏడాది అక్టోబరులో ఐటీ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటన సమయంలో టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, వనరులు, ఇతర ప్రోత్సాహకాలు, పోర్టు కనెక్టివిటీ, పవర్ లభ్యత వంటి విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం టెస్లా ప్రారంభంలో రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటుకు వెసులుబాటుతో ప్రత్యేక ప్రయోజనాలను అందించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఏపీలో టెస్లా తన కార్లను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన పోర్ట్ కనెక్టివిటీని కలిగి ఉంది. అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే.. ఆటో కంపెనీలు, బ్యాటరీ తయారీదారులు, అనుబంధ తయారీదారుల రెడీమేడ్ పర్యావరణ వ్యవస్థతో సిద్ధంగా ఉండటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు
దక్షిణ భారతంలో ఆటో అమ్మకాలు అధికంగా ఉండటంతో ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు చేయటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా పేర్కొనబడింది. దేశంలోని ఈవీ కార్ల అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. దాదాపు 60% విద్యుత్ కార్ల అమ్మకాలు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరుగుతున్నాయని వెల్లడైంది. అందుకే 2017లో కూడా చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ అప్పట్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.