తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే, జూన్ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారికీ ఎలాంటి ఇబ్బందులకు లేకుండా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.మే, జూన్ నెలల్లో సెలవులు కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.. మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు” ఆయన వివరించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్సవాల్లో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకోసం మే 10న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటాయి.

పూజాసామగ్రి
శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా జల్లి సంప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
Read Also: Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టు ఊహించని షాక్