దాదాపు ఎనిమిది ఏండ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు బుధవారంతో తెరపడనుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బుధవారం నుంచి తెరలేవనుంది. 1996 తర్వాత పాకిస్థాన్లో జరుగుతున్న ఈ టోర్నీ నిర్వహణపై యావత్ దేశం భారీ అంచనాలే పెట్టుకుంది. 9వ ఎడిషన్గా జరుగబోయే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా పాకిస్థాన్, దుబాయ్లలో నిర్వహించనున్నారు. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్లో జరిగిన ఉగ్రమూకల దాడికి ఫలితంగా 15 ఏండ్ల పాటు స్వదేశంలో భారీ టోర్నీలకు దూరమై అనధికారిక శిక్షను అనుభవిస్తున్న పాకిస్థాన్ క్రికెట్కు ఆ మచ్చను తుడిపేసి ‘మా దేశం భద్రమే’ అని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పడానికి దాయాదికి ఇది సువర్ణావకాశం. బుధవారం ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 23న దుబాయ్లో జరుగుతుంది. మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలవుతాయి.రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉంటే, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీపడతాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో గ్రూప్ దశలో జట్లు పరస్పరం తలపడతాయి. ఈ దశలో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.

ఫేవరెట్గా భారత్
భారత జట్టు ఈసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. 2013లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా ఈ ట్రోఫీ నెగ్గిన భారత జట్టు, 2017లో ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ సాధించి 12 ఏళ్ల నిరీక్షణను ముగించాలని రోహిత్ శర్మ సేన పట్టుదలతో ఉంది. ఇటీవల ఇంగ్లండ్పై 3-0తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్, అద్భుత ఫామ్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ టోర్నీలో ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమైంది.
ఆఖరి టోర్నీ
వన్డే పార్మాట్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న భారత సారథి రోహిత్ శర్మతో పాటు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి బహుశా ఇదే ఆఖరి ఐసీసీ వన్డే టోర్నీ! ఇప్పటికే కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ ద్వయం 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారనుకోవడం అత్యాశే.‘రోకో’ 2023 వన్డే ప్రపంచకప్తోనే ఈ ఫార్మాట్కు గుడ్బై చెబుతారని ఊహాగానాలు వినిపించినా ఆ టోర్నీ తుది మెట్టుపై భారత్ బోల్తా కొట్టడం వీరిని నిరాశపరిచింది. ఇటీవల కాలంలో వయసు, ఫామ్లేమితో సతమతమవుతున్నా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించిన ఈ దిగ్గజాలు తమకు అచ్చొచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో ఏం చేస్తారనేది ఆసక్తికరం. రోకోతో పాటు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్, అఫ్గాన్ మాజీ సారథి మహ్మద్ నబీ వంటి క్రికెటర్లకు ఇదే చివరి వన్డే టోర్నీ కావొచ్చు.