ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఇప్పటికే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా, తాజాగా మరో యూట్యూబ్ ఛానెల్లో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు హర్షసాయి మీద కేసు నమోదు చేశారు.
సజ్జనార్ ట్వీట్
ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నేను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తోన్న పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నాను. వారు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయాకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. దేశ భవిష్యత్ ను అగమ్య గోచరం చేసతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్ ఫ్లూయెన్సర్ల చేతిలో పెడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలను విఛ్చిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే అందరూ మేల్కొండి. బెట్టింగ్ యాప్స్ తో కలిగే నష్టాన్ని గుర్తించండి – ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ శ్రేయస్సుకు, అలాగే మన సమాజ నిర్మాణనికి తోడ్పడుతుంది’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు సజ్జనార్.
కేసు నమోదు
హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆయన అదే చర్యను కొనసాగించడంతో, సైబరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.కాగా కొన్ని నెలల క్రితం ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు హర్ష సాయి. ఈ కేసులో అతనికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యంది. అయితే బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు ఈ యూట్యూబర్.
పలువురు పై కేసు నమోదు
సజ్జనార్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం వల్ల యువత ఆర్థికంగా నష్టపోతుందని, ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సన్నీ యాదవ్పై పోలీసులుకేసు నమోదు చేశారు.సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానెల్లో బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు గెలుచుకుని, ఆ డబ్బుతో కెమెరాలు కొనుగోలు చేసినట్లు వీడియోలు పోస్ట్ చేశాడు.
ఆన్లైన్ బెట్టింగ్
విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని, ‘లోకల్ బాయ్’ నాని గా పేరొందిన వ్యక్తి,యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ఈ యాప్లకు ప్రకటనలు ఇస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని ప్రచారం చేశాడు.ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.