న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 247 పోలింగ్ బూత్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక పోలింగ్ బుధవారం జరుగుతున్నది. నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు. 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది.
ఇక, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మృతితో తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నది. డీఎంకే తరఫున వీసీ చంద్రకుమార్ పోటీచేస్తుండగా, అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్ విసురుతున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీతోపాటు ఉపఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8న వెలువడనున్నాయి.
ఈ నెల 10వ తేదీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, భాజపా తదితర పార్టీలు ఎన్నికను బహిష్కరించాయి. డీఎంకే తరఫున వీసీ చంద్రకుమార్, ఎన్టీకే అభ్యర్థిగా సీతాలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులు సహా 46 మంది పోటీ చేస్తున్నారు. చంద్రకుమార్కు మద్దతుగా మంత్రి ముత్తుసామి నేతృత్వంలో కూటమి పార్టీల నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.