జాతీయ భద్రతపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రాష్ట్రంలోని పోలీస్ శాఖ, పరిపాలనా శాఖలను అప్రమత్తం చేశారు. ఇటీవల విజయనగరంలో ఐఎస్ సంబంధాలపై ఓ యువకుడు అరెస్టైన నేపథ్యంలో, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని సూచిస్తూ రాష్ట్ర సీఎస్, డీజీపీకి ప్రత్యేకంగా లేఖలు (Latter) రాశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారుల పై తక్షణం దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం
తీర ప్రాంతాల రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని పవన్ పేర్కొనగా, సముద్ర మార్గంలో రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న అనుమానితులపైనా, అలాగే కొత్తగా గుర్తింపబడే వారిపైనా నిఘా పెంచాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి వంటి సంఘటనలు దేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో సమన్వయం చేస్తూ రాష్ట్రం ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్, ఆధార్, ఓటర్ కార్డులపై విచారణ
లేఖలో రోహింగ్యాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, గుంటూరు సహా మరికొన్ని జిల్లాల్లో వారి ఉనికి, వారికి జారీ అయిన రేషన్, ఆధార్, ఓటర్ కార్డులపై విచారణ అవసరమన్నారు. ప్రభుత్వ పత్రాలు పొందిన వారి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలపై దర్యాప్తు జరిపి నిజాలు బయటపెట్టాలని సూచించారు. దేశ భద్రతను ప్రాధాన్యతగా పరిగణిస్తూ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ముమ్మర నిఘా చర్యలు చేపట్టాలని పవన్ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
Read Also : Bhatti Vikramarka: రేవంత్ రెడ్డిపై భట్టి విక్రమార్క ప్రశంసలు