న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు మరోసారి చర్యలను ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకి నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా సెక్యూరిటీలు కొనుగోలు, డాలర్, రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో మొత్తంగా రూ.1.9 లక్షల కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఫిబ్రవరి 28, 2025 రోజున 10 బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్- రూపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించింది ఆర్బీఐ.

బ్యాంకుల వద్ద నగదు లభ్యత ఎక్కువ
లిక్విడిటీని మరింత పెంచాలనే మరోసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బ్యాంకుల వద్ద నగదు లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. దీంతో ప్రజలు ఎక్కువగా రుణాలు తీసుకునేందుకు ముందుకొస్తారు. వారి వద్ద నగదు ఉంటే కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు
రూ.50 వేల కోట్లు చొప్పున రెండు విడతలుగా మార్చి 12వ తేదీ, మార్చి 18వ తేదీల్లో ఈ సెక్యూరిటీల కొనుగోళు ప్రక్రియను చేపడతామని తెలిపింది. దీంతో పాటుగా మార్చి 24వ తేదీన మరో 10 బిలియన్ డాలర్ల యూఎస్డీ లేదా ఐఎన్ఆర్ బై లేదా సెల్ స్వాప్ వేలాన్ని సైతం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది గత జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ ఇదే తరహా చర్యలు తీసుకుంది రిజర్వ్ బ్యాంక్.