Bund-తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలు ఈ నెల 15నుంచి నిరవధికంగా బంద్ను పాటించనున్నాయి. తమకు ప్రభుత్వం నుంచి రావల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఈ నెల 15 నుంచి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించింది.
ప్రైవేటు కాలేజీలకు రావల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే టోకెన్లను జారీ చేసిన రూ.1200 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్. రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ డాక్టర్ కె.ఎస్. రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. సునీల్ కుమార్, ట్రెజరర్ కె. కృష్ణారావు డిమాండ్ చేశారు. అసోసియేషన్ నేతలు తమ సమస్యను శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో ప్రైవేటు కాలేజీలు
తమ కాలేజీలకు రావల్సిన పెండింగ్ బకాయిల మూలంగా ఉద్యోగులు, సిబ్బందికి గత కొన్ని నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే దసరా పండుగకు వారికి వేతనాలను ఇవ్వలేకపోతున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో తాము కాలేజీలను ఈ నెల 15 నుంచి నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించారు.
దేశ చరిత్రలో మొదటిసారిగా ఇంజనీర్ల దినోత్సవాన్ని (సెప్టెంబర్ 15) బ్లాక్ డేగా(Black Day) పాటిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు,(Reimbursement dues), సవరించిన, స్వయం స్థిరమైన ఫీజు రీయింబర్స్మెంట్ నమూనా తక్షణ అవసరం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి పదేపదే ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే జనరేట్ చేయబడిన టోకెన్లకు సంబంధించిన రూ.1200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు ఫండింగ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించినా, ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా బంద్
ఈ దీర్ఘకాలిక ఆలస్యం కారణంగా ప్రైవేటు సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు, సిబ్బంది జీతాలు చాలా నెలలుగా చెల్లించబడలేదని అసోసియేషన్లు పేర్కొన్నాయి. చాలా మంది అధ్యాపకులు తమ ప్రాథమిక రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారని, వారు విధులకు హాజరుకాలేని స్థితి ఏర్పడిందని తెలిపారు. దసరా సమీపిస్తుండటంతో వేలాది కుటుంబాలు జీతాల లేమితో పండుగ జరుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా ఈ నెల 16 నుంచి నిరవధిక బంద్ చేపట్టనున్నాయని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పిజి కాలేజెస్ అసోసియేషన్ ప్రకటించింది.
ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని, అద్దెలు, అప్పులు చెల్లించలేని పరిస్థితి వచ్చిందని సంఘం అధ్యక్షులు డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, బి.ఎడ్, లా కాలేజీలతోపాటు 16 నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పాటించనున్నాయి. మొత్తం 10 నుండి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారు. గత బకాయిలతో కలిపి సుమారు రూ.8,000 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
ప్రైవేటు కాలేజీలు ఎందుకు బంద్ చేస్తున్నారు?
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల కోసం.
బంద్ ఎప్పుడు మొదలవుతుంది?
సెప్టెంబర్ 15 నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు, సెప్టెంబర్ 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు.
Read Hindi News: hindi.vaartha.com
Read also :