రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపాటు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులను అధికార కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని, తాము కూడా పింక్ బుక్ మెయింటెన్ చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని అన్నారు. ట్విట్టర్లో ఎవరైనా కామెంట్ పెట్టినా, ఫేస్బుక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే చాలు పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ అండ..కవిత
వేధింపులకు సంబంధించి లెక్కలు ఎలా రాయాలో, ఉద్యమాలు ఎలా చేయాలో తమకు జయశంకర్ సార్ నేర్పించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ తన జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతున్నారని, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఆమె విమర్శించారు.
42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు..కవిత
42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును తీసుకు రావాలని కోరారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుందని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో ఒక్క బిల్లు కాకుండా, మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.