హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా రైతులను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు సమస్యలపై షాబాద్ లో రైతు ధర్నా చేసిన విషయం తెలిసిందే.
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని, వాటిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు కూడా పాల్గొననున్నారు. జంగ్ సైరన్ పేరిట ఈ ధర్నాను బీఆర్ఎస్ నిర్వహించనుంది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ, రైతు భరోసా, కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్ను నిలదీయనున్నారు. ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
కాగా, జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ధి ఈ డూప్లికేట్ గాంధీలకు ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.