ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN), రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దేనని ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు రాకుండా బయట కూర్చుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
PPP విధానంపై స్పష్టత
చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మెడికల్ రంగంలో PPP విధానంపై అసెంబ్లీలోనే పూర్తి వివరాలను సమర్పించామని గుర్తుచేశారు. ఈ వివరాలను ప్రజలందరికీ అందేలా సోషల్ మీడియా వేదిక ‘X’లో వీడియోను కూడా షేర్ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

తప్పుడు ప్రచారానికి ప్రతిఘటన
‘ఫేక్ ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం చేయలేరని’ చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడా రాజీ పడబోమని, వెనకడుగు వేయబోమని ధృడంగా చెప్పారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, నిజం మాత్రం ఎప్పటికీ బయటపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.