తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నేడు అత్యంత కీలకమైన ఘట్టం. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండటంతో, బరిలో నిలిచే అభ్యర్థులెవరో సాయంత్రానికి తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో, అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీల్లో రెబల్ అభ్యర్థుల బెడద తీవ్రంగా ఉంది. వారిని బుజ్జగించి పార్టీ అధికారిక అభ్యర్థుల గెలుపుకు సహకరించేలా చేసేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Kovvuru accident news : కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మంత్రులతో ఆయన అత్యవసర భేటీ కానున్నారు. రెబల్ అభ్యర్థుల ఉపసంహరణ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడం మరియు గెలుపు గుర్రాలను ఖరారు చేయడంపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే స్వతంత్రులుగా బరిలో ఉంటే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న అధిష్టానం, వారికి భవిష్యత్తులో తగిన పదవులు ఇస్తామనే హామీలతో దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ప్రధాన పట్టణ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తుండగా, పూర్వవైభవం కోసం బిఆర్ఎస్, పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న బిజెపి గట్టి పోటీ ఇస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఫిబ్రవరి 13న వెలువడనున్న ఫలితాలు రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో తేల్చిచెప్పనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com